ఓ అనామకుడా.. నీపై జాలి వేస్తోంది | Sakshi
Sakshi News home page

ఓ అనామకుడా.. నీపై జాలి వేస్తోంది

Published Thu, Jul 30 2020 3:01 AM

Amitabh Bachchan To Troll Saying Hope You Die With Covid - Sakshi

బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్‌ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య  కరోనా పాజిటివ్‌తో ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య, ఆరాధ్యలకు   చికిత్సానంతరం నెగటివ్‌ రావడంతో డిశ్చార్జ్‌ అయ్యారు. ఆస్పత్రిలో ఉన్నప్పటికీ తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పుటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు అమితాబ్‌. బిగ్‌ బి కుటుంబానికి చాలామంది ధైర్యం చెబుతున్నారు. కొందరైతే పూజలు కూడా చేస్తున్నారు. కానీ ‘కరోనాతో చనిపోతావ్‌ అమితాబ్‌’ అని ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌కి అమితాబ్‌ స్పందిస్తూ – ‘‘మిస్టర్‌ అనామకుడా.. కరోనాతో నేను చనిపోతానని అంటున్నావు.

నీ గురించి తెలియడానికి కనీసం నీ తండ్రి పేరు కూడా రాయలేదు.. ఎందుకంటే.. నీ తండ్రి ఎవరో నీకు తెలియదు. నేను బతకవచ్చు లేదా చనిపోవచ్చు. ఒకవేళ నేను చనిపోతే నన్ను దూషించడానికి నీకు పని దొరకదు. నాలాంటి ఓ ప్రముఖుని పేరుపై ఇలాంటి వార్తలు సృష్టించడం వల్ల నీపై జాలేస్తోంది. దేవుని దయ వల్ల నేను బతికితే.. 9 కోట్ల నా ఫాలోయర్ల ప్రేమతో నువ్వే తుడిచి పెట్టుకుపోతావు. నీ గురించి వారికింకా తెలియపరచలేదు. కానీ చెబుతాను. ఆ తర్వాత ప్రపంచం మొత్తంలో పశ్చిమం నుంచి తూర్పు వరకు.. ఉత్తరం నుంచి దక్షిణం వరకు నిన్ను వెతుకుతారు.. అడ్డుకుంటారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘టోక్‌ దో సాలే కో’ (వదిలేయండి వాణ్ణి) అన్నారు.

Advertisement
Advertisement