లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిపాలయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. శనివారం సాయంత్రం కడుపునొప్పితో బాధపడుతున్న బిగ్బీ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరాడని, అప్పటినుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నాడని సదరు వార్తల సారాశం. దీంతో అభిమానులు బిగ్బీకి ఏమైందని ఆందోళన చెందుతున్నారు.
అసలేమైంది?
కాగా బిగ్బీకి కూలీ సినిమా (1983) చిత్రీకరణ సమయంలోనే కడుపు నొప్పి సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఆయన నిజంగానే ఆస్పత్రిలో ఉన్నాడా? అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. అయితే ఈ ప్రచారం అంతా ఉట్టిదేనని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ప్రతి ఆదివారంలాగే మొన్నటి ఆదివారం కూడా తన నివాసం బయటకు వచ్చి అభిమానులకు ఆప్యాయంగా నమస్కరించాడు.
భయం మటుమాయం
అందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఎప్పటిలాగే నా శ్రేయోభిలాషలను కలిసేందుకు నేను ఇంటి నుంచి బయటకు వస్తాను. ఆ సమయంలో నాలో ఒక ప్రశ్న తలెత్తింది. వారు నిజంగానే బయట ఉన్నారా? ఒకవేళ ఉన్నా నన్ను కలవడానికి వచ్చారా? లేదా హేళన చేసేందుకు వచ్చారా? అని ఒకింత భయం వేసింది. కానీ బయటకు వస్తుండగానే వారి కేరింతలు నాలోని భయాన్ని మటుమాయం చేశాయి. నాలో సంతోషాన్ని రెట్టింపు చేశాయి. పిల్లలు, పెద్దలు.. ఇలా అందర్నీ చూసేసరికి మనసుకు తేలిక. నిజంగా నేనెంత అదృష్టవంతుడిని అని రాసుకొచ్చాడు.
మౌనంగా ఉంటేనే..
ఇక రొటీన్ చెకప్లో భాగంగానే అమితాబ్ ఆస్పత్రికి వెళ్లి వచ్చాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్బీ.. బుధవారం నాడు తన బ్లాగ్లో హిందీలో ఓ పద్యం రాసుకొచ్చాడు. 'గద్ద మౌనంగా ఉన్నప్పుడే రామచిలకలు మాట్లాడటం మొదలుపెడతాయి. నచ్చిన విందు ఆరగిస్తాయి. బ్రెడ్డు, ధాన్యపు గింజలు నోట్లో పడగానే కాకుల్లా అరవడం మొదలుపెడతాయి' అని దాని సారాంశం. బహుశా తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్పై బిగ్బీ ఇలా కౌంటరిచ్చాడేమో! ప్రస్తుతం బిగ్బీ కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కనిపించనున్నాడు.
చదవండి: జైల్లోనే దర్శన్ పెళ్లిరోజు.. భార్య ఎమోషనల్ పోస్ట్


