మనసు దోచే సిద్ధలయ్య కోన (SiddalaKona in Sydapuram)
ఉట్టిపడుతున్న ప్రకృతి రమణీయత ..భక్తులకు అనువైన వేసవి విడిది
నెల్లూరు : పచ్చదనం.. ప్రకృతి రమణీయత.. మనసు దోచే రమ్యమైన దొరువులు.. కనువిందు చేసే ఎత్తయిన కొండలు.. ఇక్కడ ప్రతి చెట్టూ పుట్టా, కొండా కోన అన్నీ స్వామివారి స్వరూపాలే.. నేటి యాంత్రిక జీవనంలో కాలంతో పరుగులు తీసి అలసిన మానవాళి సర్వమత సమ్మేళనంగా ఇక్కడకు విచ్చేసి సేదతీరుతారు.
జీవ వైవిధ్యానికి నెలవుగా ప్రకృతి సిద్ధమైన ఈ వాతావరణంలో ఉన్న ఒక అద్భుతమైన ఔషధ క్షేత్రం. ఈ సిద్ధలయ్య కోనను కనులారా వీక్షిద్దాం రండి.
సైదాపురం: మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో వాయువ్య దిశలో మానవ సంచారానికి దూరంగా ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో శ్రీసిద్ధలయ్యకోన వెలసి ఉంది.
దైవాంశ సంభూతులైన ఇద్దరు యోగీశ్వరులు శ్రీనవకోటి సిద్దలయ్య, నవనాధు సిద్దలయ్యతోపాటు వారి ప్రియశిష్యులైన సారంగధరుడు స్వయంభువులుగా వెలిశారు.
ఇక్కడ ఆశ్రమం కూడా ఉంది. చల్లని వాతావరణం ఉండడంతో భక్తులు వేసవిలో సేద తీరుతారు. వేసవి సెలవుల్లో పిల్లలు ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కోనకు తరలి వస్తుంటారు.
సిద్దలయ్యకోన వద్ద శివాలయం, సాయిబాబా, వినాయకుడు, దత్తాత్రేయస్వామి నాగదేవత, సరస్వతిదేవీ ఆలయాలు ఉన్నాయి. ఇటీవల కొత్తగా కోనేరును నిర్మించారు. స్వామి ఆలయం వద్ద ఆశ్రమం భక్తులకు ఎంతో ఆనందాన్నిస్తోంది.
నెల్లూరు నుంచి గూడూరు మీదుగా 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెదాపురానికి చేరుకోవచ్చు. నెల్లూరు నుంచి పొదలకూరు మీదుగా 52 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి భక్తులు ఆటోలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనవద్దకు చేరుకోవచ్చు.
కడప నుంచి రాపూరుకు చేరుకుని అక్కడి నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైదాపురానికి చేరుకుంటే అక్కడి నుంచి సులభంగా కోనవద్దకు ఆటోలు, కార్లలో చేరుకోవచ్చు. పొదలకూరు, గూడూరు, రాపూరు మీదుగా సైదాపురానికి ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం ఉంది.
తిరునాళ్ళు: ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఇక్కడ పెద్ద ఎత్తున తిరునాళ్ళు జరుగుతాయి. ముఖ్యంగా కార్తీక మాసం 2, 3వ సోమవారాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.


