● 2వ విడతలో వారికే ప్రాధాన్యం
● జిల్లా వ్యాప్తంగా 2,500 ఇళ్ల గుర్తింపు
● పాత ఇంటికీ రూ.2 లక్షల సహాయం
మెదక్జోన్: ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రెండో విడతలో పాత, పూరిగుడిసెల వారికి సహాయం అందించనున్నారు. రెండో విడత ఇందిరమ్మ పథకంలో భాగంగా జిల్లాకు ఆరువేల ఇళ్లు మంజూరు కాగా వాటిలో మొదటి ప్రధాన్యత పూరిగుడిసెలు ఉన్న వారికి ఇస్తున్నారు. గతంలో నిర్మించుకున్న పాత ఇళ్లకు కూడా రూ.2 లక్షల సాయం అందించనున్నారు.
కొనసాగుతున్న సర్వే
రెండో విడతలో భాగంగా పూరిగుడిసెల్లో నివాసం ఉంటున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,500 పూరిగుడిసెలు ఉన్నట్లు అధికారులు సర్వేలో గుర్తించారు. జిల్లాకు ఆరు వేల ఇళ్లు మంజూరు కాగా వాటిలో పూరి గుడిసెలు పోనూ మిగతా 3,500 ఇందిరమ్మ ఇళ్లను గతంలో నిర్మించుకొన్న వారికి ఎంపిక చేస్తున్నారు. ఇందులో పూరిగుడిసెల్లో నివాసం ఉండేవారికి రూ.లక్ష రుణం ఇప్పించి ఇల్లు నిర్మించుకునే విధంగా అధికారులు ప్రోత్సహిస్తున్నారు.
పాత ఇళ్లకు రూ.2 లక్షలు
గతంలో ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించుకుని గోడలపై రేకులు వేసుకున్న లబ్ధిదారులకు సైతం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రభుత్వం ఇచ్చే సహాయంతో గోడలపై రేకులు తొలగించి వాటిపై స్లాబు వేసుకునేందుకు ఇది చక్కటి అవకాశం.


