జిల్లాలోనే పెద్దదైన అక్కన్నపేట రైల్వేస్టేషన్లో కనీస సౌకర్యాలు కరువై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా.. ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కల్పనలో మాత్రం రైల్వే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
– రామాయంపేట(మెదక్)
అక్కన్నపేట రైల్వేస్టేషన్ సమస్యలకు నిలయంగా మారింది. స్టేషన్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. ముఖ్యంగా తాగునీటి పరిష్కారం విషయమై ఆశాఖ అధికారులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్లో కనీసం మూత్రశాలలు కూడా లేకపోవడంతో మహిళా ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదాయపరంగా ఉన్నత స్థానంలో ఉన్న ఈస్టేషన్లో కనీస వసతులు కరువయ్యాయి. అలాగే స్టేషన్లో కోతులు, కుక్కలు, పందుల బెదడ తీవ్రంగా ఉంది. కోతులు ప్రయాణికులపై దాడులు చేస్తూ వారి బ్యాగులు ఎత్తుకెళ్తుండటంతో భయాందోళన చెందుతున్నారు. పలువురు ప్రయాణికులు గాయపడిన సంఘటనలు ఉన్నాయి. స్టేషన్ చెత్తా చెదారంతో నిండిపోవటంతో పందుల బెడద తీవ్రంగా ఉంది.
తాగునీటి ఎద్దడి తీవ్రం
రైల్వేస్టేషన్లో నెలకొన్న నీటి ఎద్దడిని పరిష్కరించాలని ప్రయాణికులు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. రెండు, మూడు రోజులకోసారి ట్యాంకర్లో నీరు తెస్తున్నారు. అయినప్పటికీ అవి ఏ మూలకు సరిపోవడం లేదు. రైలు ఆగిన సమయంలో ప్రయాణికులు తాగు నీటి కోసం కుళాయిల వద్దకు పరుగులు పెడుతున్నా నీరులేక వెనుదిరుగుతున్నారు. ఇప్పటికై నా ఆశాఖ అధికారులు స్టేషన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అక్కన్నపేట రైల్వేస్టేషన్లో వసతుల లేమి
పట్టించుకోని అధికారులు
ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు


