● నేడు వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం
● ఆకట్టుకుంటున్న వన్యప్రాణుల చిత్రాలు
రామాయంపేట(మెదక్): మండలం అక్కన్నపేట అటవీ ప్రాంతంలో నిర్మించిన నగర వన యోజన పార్కును గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభించనున్నారు. పట్టణానికి ఐదు కిలోమీటర్లు దూరంలో 765 జాతీయ రహదారిని ఆనుకొని నిర్మించారు. దీని నిర్మాణానికిగాను రూ.రెండు కోట్లు మంజూరయ్యాయి. చాలావరకు పనులు పూర్తికాగా, చిన్న చిన్న పనులు కొనసాగుతున్నాయి. పట్టణ ప్రజలతోపాటు జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులు ఈ పార్కులో సేద తీరే అవకాశం ఉంటుంది. పార్కు నిర్మాణానికిగాను అటవీప్రాంతంలో వంద ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించారు. ప్రధాన గేట్ పైభాగంలో ఏర్పాటు చేసిన చిరుత, నెమళ్ల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. గోడలపై ఇరువైపులా చిరుత, ఎలుగుబంట్లు, ఇతర వన్యప్రాణుల చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. వాచ్టవర్, మెయిన్గేట్, హర్బల్, బొటానికల్ గార్డెన్ల నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవం తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని రేంజ్ అధికారి విద్యాసాగర్ తెలిపారు. ప్రారంభోత్సవం రోజున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, జిల్లా అటవీ అధికారి జోజి, కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు రానున్నారు.
పార్కు ప్రధాన గేట్


