రామాయంపేట(మెదక్): తన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారనే ఆవేదనతో ఓ రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని అక్కన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన రైతు పోలీస్ శ్రీనివాస్కు చెందిన ఎకరంన్నర భూమిని గతంలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టా మార్పు చేయించుకున్నాడు. ఆ భూమి కోసం బాఽధిత రైతు కొంత కాలంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగడంతోపాటు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రెండు రోజుల క్రితం గ్రామస్తులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఎస్ఐ బాల్రాజు గ్రామానికి వచ్చి ఇరువర్గాలను విచారిస్తున్న క్రమంలో గొడవ జరిగింది. దీంతో మనోవేదనకు గురైన బాధిత రైతు శ్రీనివాస్ సెల్ టవర్ ఎక్కాడు. సుమారు రెండు గంటలపాటు టవర్ పైనే ఉన్నాడు. తహసీల్దార్ రజని, సీఐ సైదా, ఎస్ఐ బాల్రాజు సంఘటనా స్థలానికి చేరుకొని అతనికి నచ్చజెప్పగా కిందకు దిగాడు. అనంతరం తహసీల్దార్ గ్రామస్తులతో కలిసి సదరు భూమివద్దకు వెళ్లి పరిశీలించారు.
తన భూమిని ఆక్రమించారని ఆవేదన


