వీరహనుమాన్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సబ్స్టేషన్
మెదక్ పట్టణం పిల్లికొటాల్ సమీపంలోని పుష్పాలవాగు పక్కన ఉన్న 33 కేవీ సబ్స్టేషన్ నుంచి పట్టణంలోని ఆటోనగర్, నర్సాపూర్ ఎక్స్రోడ్డు, వెంకట్రావునగర్ కాలనీ, పిల్లికొటాల్, డబుల్బెడ్రూంలు, నవాబుపేట వ్యవసాయ పంపుసెట్లు, పట్టణానికి తాగునీరు అందించే పంప్హౌస్కు విద్యుత్ సరఫరా అయ్యేది. కాగా, గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు సబ్స్టేషన్ మునిగిపోవటంతో ఆరు ఫీడర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో గల రాజ్పల్లి సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దానిపై ఓవర్లోడ్ పడటంతో తరచూ ట్రిప్ అవుతోంది. అలాగే ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీంతో పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
రూ. 3 కోట్లు మంజూరు
వీరహనుమాన్ కాలనీలో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 3 కోట్లు మంజూరు చేసింది. టెండర్ పనులను ఆన్లైన్ ద్వారా దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. మూడు నెలల్లో పనులు పూర్తి కావాల్సి ఉండగా, నేటికీ పూర్తి కాలేదు.
శాఖల మధ్య సమన్వయ లోపం
విద్యుత్, ఫారెస్ట్ శాఖల మధ్య సమన్వయ లోపం ప్రజలకు శాపంగా మారింది. రోడ్డు పక్కన గల విద్యుత్ తీగల కింద మొక్కలు నాటడంతో అవి పెరిగి వైర్లకు తాకుతున్నాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. అధికారులు ముందు చూపు లేకుండా లక్ష్యం పూర్తి చేయాలని మొక్కలు నాటడంతో సమస్య ఉత్ప న్నం అవుతుంది.
ఏడాదిగా సా..గుతున్న
సబ్స్టేషన్ నిర్మాణం
రాజ్పల్లి నుంచి
కరెంట్ సరఫరా
ఓవర్లోడ్తో తరచూ ట్రిప్
ఇబ్బంది పడుతున్న
పట్టణ ప్రజలు
మెదక్ పట్టణ ప్రజలను కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు పిల్లికొటాల్ సబ్స్టేషన్ మునిగిపోయింది. దీంతో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ పది నెలలుగా నిర్మాణ పనులు చేస్తున్నా, నేటికీ అతీగతీలేదు. రాజ్పల్లి సబ్స్టేషన్ నుంచి కరెంట్ సరఫరా చేస్తున్నా.. ఓవర్లోడ్తో తరచూ ట్రిప్ అవుతోంది. ఫలితంగా పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
– మెదక్జోన్
రెండు, మూడు రోజుల్లో పూర్తి
కొత్త నిర్మిస్తున్న సబ్స్టేషన్పై ఆరు ఫీడర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు నాలుగు పూర్తి చేశాం. మరో రెండు ఫీడర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితో పాటు మూడు కిలోమీటర్ల మేర విద్యుత్ స్తంభాలు నాటాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తాం.
– మోహన్బాబు, మెదక్ ట్రాన్స్కో ఏడీ


