
మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: విద్యా సంస్థలకు సమీపంలో ఎక్కడా పొగాకు విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. విద్యా సంస్థలకు చుట్టుపక్కల దొంగచాటుగా పొగాకు, అనధికారంగా మద్యం, డ్రగ్స్ విక్రయించే వారిపై విద్యాసంస్థల యాజమాన్యాలు నిఘా ఏర్పాటు చేసుకొని పోలీస్లకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే విద్యార్థులకు డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. విద్యాసంస్థల ప్రవేశ సరిహద్దు గోడకు పొగాకు రహిత విద్య సంస్థ అనే సంకేతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.