
ఇక డుమ్మాలకు చెక్
సాక్షి, సిద్దిపేట: జిల్లా ప్రజా పరిషత్లు, మండల పరిషత్ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ హాజరును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లా ప్రజా పరిషత్లు,73 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ సంబంధిత మెషీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ల పాలక వర్గాల గడువు గతేడాది జూలై 4వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్లు జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారులుగా, మండల పరిషత్ ప్రత్యేక అధికారులుగా పలువురు జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. మండల పరిషత్లలో పలువురు అధికారులు సమయ పాలన పాటించడం లేదని గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ మెషీన్లు బిగించి సమయ పాలన పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
గతంలో ఆఫ్లైన్
గతంలో పలు కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు ఆఫ్లైన్లో ఉండేది. అది సక్రమంగా పనిచేయకపోవడంతో పరికరాలు మూలన పడ్డాయి. దీంతో చాలామంది కార్యాలయ సిబ్బంది విధుల పట్ల జాప్యం వహించడం, తరచుగా డుమ్మా కొట్టడం, ఇంటికి వెళ్లడం, విధులకు రాకపోయినా వచ్చినట్లు నమోదు చేసుకుంటున్నారు. పలువురు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలకు మెరుగైన సేవలు అందడం లేదు. వీటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఆన్లైన్ బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
సిద్దిపేట జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ మెషీన్లో హాజరు నమోదు చేసుకుంటున్న సిబ్బంది
జిల్లా మండల పరిషత్లు
సిద్దిపేట 26
సంగారెడ్డి 26
మెదక్ 21
ఉద్యోగుల నుంచి ఆధార్ నంబర్,హోదా వివరాల సేకరణ
ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు
జిల్లా పరిషత్లు, 73 మండల పరిషత్లు
ఉద్యోగుల వివరాల సేకరణ
బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ మెషీన్లో ఉద్యోగులను గుర్తించేందుకు వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగుల హోదా, ఆధార్ నంబర్, ఉద్యోగుల క్రమసంఖ్య తదితర వివరాలను బయోమెట్రిక్లో నమోదు చేస్తున్నారు. బయోమెట్రిక్ హాజరుతో ఉద్యోగులు ఏ సమయానికి వస్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? ఎంతమంది సిబ్బంది హాజరయ్యారు? అనే విషయాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంకు తెలియనుంది.