
ధరణిలో అనేక అవకతవకలు
నర్సాపూర్ రూరల్: భూ సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని రెడ్డిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణిలో అనేక అవకతవకలు జరగడంతో అనేక మంది రైతులు తమ భూ ములను కోల్పోయారని విమర్శించారు. పేద రైతులను మోసం చేసి కొంతమంది భూస్వాములు ధరణిలో భూములను సొంతం చేసుకున్నారని ఆరోపించారు. గతంలో అక్రమాలకు గురైన భూములను సరిచేసేందుకే మా ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందన్నారు. భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, రెడ్డిపల్లి మాజీ ఉప సర్పంచ్ అశోక్గౌడ్, శివప్రసాద్గౌడ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్