ప్రతి ఏడాదీ జాబ్‌ క్యాలెండర్‌! : హరీశ్‌రావు | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఏడాదీ జాబ్‌ క్యాలెండర్‌! : హరీశ్‌రావు

Nov 28 2023 7:00 AM | Updated on Nov 28 2023 11:18 AM

- - Sakshi

ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: 'ఓటరన్న రిస్క్‌ తీసుకోవద్దని అంటున్నారు ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్‌ మెజార్టీలు సాధించిన ఆయన మరోసారి సిద్దిపేట నుంచి బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను ‘సాక్షి’ పలకరించింది. కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటు వేయడం అంటే మూడు గంటల కరెంట్‌కు ఒప్పుకోవడమే అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఏడాదీ జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసి వెంట వెంటనే ఉద్యోగాలను భర్తీ చేస్తామంంటున్నారు.

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అండ, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి బీఆర్‌ఎస్సే గెలుస్తుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తాం. తద్వారా ఈ జిల్లా పార్టీ కంచుకోటగా మరోసారి నిరూపితమవుతుంది. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం అవుతారు. నాడు కాంగ్రెస్‌ పాలనలో పరిస్థితిని. నేడు బీఆర్‌ఎస్‌ పాలనలో పరిస్థితిని గుండె మీద చేయి వేసుకుని పరిశీలించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.

నాడు కరువు, కాటకాలతో వలసల జిల్లాగా ఉన్న ఈ ప్రాంతం నేడు రెండు పంటలు పండే పచ్చని మాగాణిగా మారింది. నారాయణఖేడ్‌, జోగిపేట, జహీరాబాద్‌ ప్రాంతాల్లో వలసలు వాపస్‌ వచ్చా యి. కర్ణాటక సరిహద్దుల్లో ఉండడం వల్ల ప్రజలకు స్పష్టత వచ్చింది. మూడు, నాలుగు నియోజకవర్గాలకు ఆ రాష్ట్రంతో బాగా సంబంధాలుంటాయి. అక్కడ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఐదు గ్యా రంటీలు అమలు కాలేదు.

ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనం పై నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. 8 గంటల కరెంట్‌ కాస్తా 3 గంటలకే పరిమితమైంది. అక్కడి రైతుబంధులు ఆపేశారు. అలాగే స్కాలర్‌ షిప్‌లలో కోత, తాగు నీటికి, తిండి గింజలకు ఇబ్బందే ఉంది. అక్కడి బాధలు చూసి, ప్రత్యక్షంగా తెలుసుకుని బీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్నారు.

► మార్పు అంటే 3 గంటల కరెంటా?
కాంగ్రెస్‌ వాళ్లు మార్పు అంటున్నారు. 24 గంటల కరెంట్‌ నుంచి 3 గంటలకు తగ్గించడమే మార్పా? ప్రజల జీవన విధానం, ఆర్థిక స్థితిగతుల్లో మార్పు రావాలి. కాంగ్రెస్‌ దేశంలో ఎక్కడా రూ. 1000 మించి పెన్షన్‌ ఇవ్వడం లేదు. నాడు అధికారంలో ఉన్న ప్పుడూ ఇవ్వలేదు. నేడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇవ్వడం లేదు. తెలంగాణలో ఇస్తామనడం ఇక్కడి ప్రజలను మభ్యపెట్టడమే.

నాన్‌ లోకల్స్‌..
కాంగ్రెస్‌ అధికారంలో వస్తే పైరవీకారులు, బ్రోకర్ల రాజ్యం వస్తుంది. రాహుల్‌, ప్రియాంక ఎన్నికల ముందే కనబడతారు. ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఉంటారు. నేడు కర్ణాటకలో రాహుల్‌ జాడలేడు. ప్రియాంక పత్తాలేకుండా పోయింది. ప్రజలకు ఇచ్చి హామీలు అమలు చేయడం లేదు.

కేసీఆర్‌ అంటే నమ్మకం!
కేసీఆర్‌ అంటే నమ్మకం. కాంగ్రెస్‌ అంటే మోసం. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో రూ.400కే సిలిండర్‌, సౌ భాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు నెలకు రూ.3వేలు, ఆసరా రూ.5వేలు, పేదలకు సన్న బియ్యం అందిస్తాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15లక్షలకు పెంచుతాం. అసైన్డ్‌ భూములు పట్టా భూములుగా మార్చడం, గురుకులాలను డిగ్రీ కళాశాలకు అప్‌గ్రేడ్‌ చేస్తాం. కానీ అసైన్డ్‌ భూములను ప్రభుత్వం తీసుకుంటుందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ జిల్లా బిడ్డగా హామీ ఇస్తున్నా. ఒక్క గుంట భూమిని తీసుకోం. వాటికి పట్టాలిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement