అంత ఇవ్వలేం!
గడువు దాటితే పెనాల్టీ
సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విషయంలో ప్రభుత్వ నిబంధనలను రైస్ మిల్లర్లు ఉల్లంఘించడం పరిపాటిగా మారింది. ఈసారి ఏకంగా 60 మంది మిల్లర్లు కూడబలుక్కుని సర్కార్కు వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. ఇటు మిల్లులపై వరుసగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు కొనసాగుతున్నాయి. ఇది ఎక్కడి వరకు వెళ్తుందనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
– మెదక్జోన్
జిల్లావ్యాప్తంగా బాయిల్డ్, రారైస్కు సంబంధించి సుమారు 126 రైస్మిల్లులు ఉన్నాయి. వీటిలో నిబంధనలు అతిక్రమించిన కొన్నింటిపై ఇప్పటికే కేసులు నమోదు కాగా, మరికొన్ని కోర్టు పరిధిలో కేసులు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య మరో రగడ మొదలైంది. 2022 రబీ సీజన్కు సంబంధించిన ఽ1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించేందుకు 72 రైస్ మిల్లులకు ధాన్యం ఇచ్చారు. ఇందులో 12 మంది మిల్లర్లు 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సకాలంలో ఇవ్వకపోవడంతో అధికారులు వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఇందుకు సంబంధించి ఆర్ఆర్యాక్ట్ను సైతం ప్రయోగించారు. ఇక పోతే మరో 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం 60 మిల్లర్ల వద్ద ఉండిపోయింది. నిబంధనల ప్రకారం ధాన్యం దింపుకున్న 10 నెలల్లో తిరిగి సీఎంఆర్ ఇవ్వాలి. కానీ మూడేళ్లు గడిచిపోయినా బియ్యం ఇవ్వకపోవడంతో సివిల్ సప్లయ్ అధికారులు ఆ ధాన్యాన్ని వేలం వేశారు. ఓ వ్యక్తి క్వింటాల్ ధాన్యానికి రూ.1,999 చొప్పున వేలం పాటలో దక్కించుకున్నాడు. కానీ అతడు సకాలంలో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టర్కు పెనాల్టీ విధించారు. కాగా, ఆ ధాన్యం అలాగే 60 మంది మిల్లర్ల వద్ద ఉండిపోవడంతో సకాలంలో సీఎంఆర్ ఇవ్వనందుకు గానూ క్వింటాల్ ధాన్యానికి రూ. 2,236 చొప్పున 80 వేల మెట్రిక్ టన్ను ధాన్యానికి రూ. 178.88 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈనెల 7వ తేదీ వరకు గడువు ఇచ్చింది.
వరుస దాడులు
కొల్చారం రైస్మిల్లులో ఇటీ వల రూ. 7 కోట్ల ధాన్యం పక్కదారి పట్టిన విషయం వెలుగులోకి రావడంతో సీఎంఆర్ ధాన్యం స్వీకరించిన మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఇప్పటివరకు అల్లాదుర్గం, వెల్దుర్తి తదితర మండల కేంద్రాల్లోని పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు.
సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టుకు 60 మంది మిల్లర్లు
2022 రబీ సీజన్కు సంబంధించిన వివాదం
క్వింటాల్కు రూ.2,236 చొప్పున ఇవ్వాలన్న ప్రభుత్వం
అంత ఇచ్చుకోలేమని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైనం
80 వేల మెట్రిక్ టన్నుల ధా న్యానికి సంబంధించి 60 రైస్ మిల్లర్లు రూ. 178.88 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈనెల 7 వరకు గడువు ఉంది. ఆలోగా చెల్లించకపోతే 25 శాతం పెనాల్టీ విధిస్తాం.
– జగదీశ్, సివిల్ సప్లయ్ డీఎం
క్వింటాల్కు రూ. 1,800 కన్నా ఎక్కువగా ఇవ్వలేమని మిల్లర్లు పేర్కొంటున్నారు. అదే ధాన్యాన్ని టెండర్ వేస్తే సదరు కాంట్రాక్టర్ క్వింటాల్కు రూ. 1,999 చొప్పున వేలంలో దక్కించుకొని వెళ్లిపోయాడని వారి వాదన. ఆ ధరను తగ్గించాలని అప్పటివరకు ప్రభుత్వం తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని 60 మంది మిల్లర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టుకెళ్లారు. కాగా, ఇప్పటికే జిల్లాలో పలు రైస్ మిల్లుల యజమాన్యాలు అక్రమాలకు పాల్పడటంతో వారిపై క్రిమినల్ కేసులు పెట్టిన సంబంధిత అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, తాజాగా మరో 60 మంది మిల్లర్లు కోర్టుమెట్లు ఎక్కడం చర్చనీయాంశంగా మారింది.


