పేదింటి విద్యార్థులకు హరీశ్రావు భరోసా ఫీజు కట్టలేని వారికి చేయూత మెడికల్ సీట్ల కౌన్సెలింగ్లో జాగ్రత్త
విద్యార్థి అఖిలకు భరోసా
సిద్దిపేటజోన్: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు సాధించి ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న నియోజకవర్గ విద్యార్థులు బాధపడొద్దని తన దృష్టికి తీసుకొస్తే వారిని సొంత పిల్లల లెక్క భావించి చదివించే బాధ్యత నేను తీసుకుంటానని మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్లో ఇటీవల నీట్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మెడికల్ కౌన్సెలింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిన హరీశ్రావు గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతుండటంతో రాలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన ఫోన్ ద్వారా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఒకప్పుడు వైద్య విద్య కోసం మన పిల్లలు చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు వెళ్లేవారని కానీ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల పిల్లలు మన రాష్ట్రానికే వస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదింటి విద్యా కుసుమం. అఖిల....తండ్రి రాజు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయాడు. తల్లి హోటల్లో పనిచేస్తుంది. ముగ్గురు పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఆదుకోవాలని మాజీమంత్రి హరీశ్రావును కుటుంబం ఆశ్రయించింది. స్పందించిన ఆయన డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేశారు. పిల్లల చదువుల బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా అఖిలను మెరిడియన్ విద్యా సంస్థలో చేర్పించారు. ఇంటర్ వరకు ఫీజులు భరించారు. ఈ క్రమంలో అఖిల నీట్ పరీక్ష రాసి 720 మార్కులకు గాను 453 సాధించింది. మెడిసిన్ సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హరీశ్రావు నీట్ ర్యాంక్ సాధించిన అఖిల, తల్లి రేణుకను ఇంటికి పిలిపించి భోజనం పెట్టి మెడిసిన్ చదువు కోసం అధైర్యపడొద్దని, ఐదేండ్ల విద్య,పుస్తకాల ఖర్చులు తానే స్వయంగా చెల్లిస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్ అయ్యే వరకు బాధ్యత తనదే అంటూ భరోసా ఇచ్చారు.


