రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
పటాన్చెరు టౌన్: ప్రతీ భారతీయ పౌరుడు రాజ్యాంగాన్ని తెలుసుకొని, అందులోని విలువలను జీవితంలో ఆచరించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు. ఆదివారం ముత్తంగి డివిజన్ పరిధిలోని విశ్వభారతి లా కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయశాఖ డీన్ ఆచార్య వెంకటేశ్వర్లు, లా కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ రవి అనంత, ప్రిన్సిపాల్ భవానీలతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం నిర్దేశించిన విలువలను ఆచరణలో పెట్టాలని సూ చించారు. చట్టం ఉద్దేశం, సమాజంలో న్యాయ పరిరక్షణలో దాని పాత్రను విద్యార్థులు అర్థం చేసుకుని బాధ్యతాయుతమైన న్యాయవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం ఓయూ న్యాయశాఖ డీన్ ఆచార్య వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. న్యాయ విద్యలో అకాడమిక్ పరిశోధనలు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి కీలకమన్నారు. ఆన్లైన్ వివాద పరిష్కార వ్యవస్థలకు ప్రాధాన్యం పెరుగుతోందని, విద్యార్థులు ఈ రంగాల్లో నైపుణ్యం సాధించాలని సూచించారు. కళాశాల కరస్పాండెంట్ రవి అనంత మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రమ్యశ్రీ, గురుమూర్తి, తేజశ్రీ, అడ్మిన్ విభాగం మురళి, రాము, లా కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


