మంచిర్యాలక్రైం: యువత గంజాయి మత్తుకు అలవాటు పడి అందమైన జీవితాలను నాశనం చేసుకోకుండా కాపాడుదామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డీ అడిక్షన్ సెంటర్ను సందర్శించారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయికి బానిసైన వారిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వారిలో మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు. యువతలో వింత ప్రవర్తన కనిపిస్తే డయల్ 100, స్థానిక పోలీసుస్టేషన్లో సమాచారం అందించాలని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీలు ప్రకాష్, కిరణ్కుమార్, వెంకటేశ్వర్లు, సీఐ ప్రమెద్రావు, డీ అడిక్షన్ సెంటర్ వైద్యులు రామునాయక్ పాల్గొన్నారు.
నేరస్తులకు స్ట్రాంగ్ పోలీసింగే..
మంచిర్యాలక్రైం: నేరస్తుల పట్ల నో ఫ్రెండ్లీ పోలీస్.. ఇకపై అంత స్ట్రాంగ్ పోలీసింగే అని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. కార్యాలయం ఆవరణ, పరిసర ప్రాంతాలు, రికార్డులు పరిశీలించారు. అనంతరం స్థానిక జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్యను జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆయన ప్రత్యేక చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్ పాల్గొన్నారు.


