రామకృష్ణాపూర్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవార్డుల ఎంపికలో రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి ప్రభుత్వ రంగ ఆసుపత్రుల విభాగంలో ప్రథమ స్థానం సాధించింది. హెల్త్ కేర్సేవల నాణ్యత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాల అమలు, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, ఆసుపత్రి పరిసరాల అభివృద్ధిలో చూపిన విశిష్ట పనితీరుకు ఈ పురస్కారం దక్కింది. ఈ మేరకు ఆసుపత్రి డీవైసీఎంఓ డాక్టర్ మధుకుమార్ శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మెరుగైన వైద్యసేవలకు కృషి చేస్తున్న ఆసుపత్రి సిబ్బందిని మధుకుమార్ ప్రత్యేకంగా అభినందించారు.


