సంతానం లేదని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సంతానం లేదని ఆత్మహత్య

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

కడెం: సంతానం కలగలేదని మనస్తాపంతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్‌ పట్టణానికి చెందిన మండ శ్రీనివాస్‌ (40)కు వివాహమై పదేళ్‌లైనా సంతానం కలుగలేదు. దీంతో మనస్తాపంతో మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 4న కడెం ప్రాజెక్ట్‌ వద్ద గల మిషన్‌ భగీరథ ఇంటెక్‌వెల్‌ వద్ద నీళ్లలో దూకి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సర్పంచ్‌ దీకొండ విజయ్‌, ఉప సర్పంచ్‌ రాజు యువకుల సహాయంతో శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహన్ని బయటకు తీయించారు. శ్రీనివాస్‌ లక్ష్మణచాంద మండలంలోని పార్‌పెల్లి సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య

కుంటాల: మండలంలోని మెదన్‌పూర్‌ గ్రామానికి చెందిన మోరె అశోక్‌ (54) మద్యానికి బానిసై శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్‌ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

మందమర్రిరూరల్‌: మండలంలోని సండ్రోన్‌పల్లి గ్రామానికి చెందిన ఏదులు రాజ్‌కుమార్‌(26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కుమార్‌ కొంతకాలంగా కుటుంబ కలహాలతో మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి 8గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం 7గంటల ప్రాంతంలో గ్రా మ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతుడి తల్లి లస్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన సఫియా సుల్తాన వాస్మోలిన్‌ తాగి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. 2010లో ఈమెకు వివాహం జరగగా, 2018లో భర్త మృతిచెందాడు. అప్పటినుంచి ఇందిరానగర్‌కు చెందిన యువకుడు ఆసిఫ్‌ రజాతో సహజీవనం చేస్తోంది. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని వన్‌టౌన్‌ సీఐ సునిల్‌కుమార్‌ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement