మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. నాలుగు రోజులుగా జనాలు బ యటకు రావడానికి జంకుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బతో అల్లాడిపోతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువవుతుండగా కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు చేరుకున్నాయి. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 42.6, కనిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలుగా నమోదైంది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వడదెబ్బకు గురవుతున్నారు. ఇప్పటివరకు వడదెబ్బతో జిల్లాలో ముగ్గురు చనిపోయారు. ఉదయం 9నుంచే ఎండ దంచి కొడుతుండగా మధ్యాహ్నం 12గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం 6గంటల తర్వాత గాని బయటకు రాని పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అల్లాడిపోతున్నారు.
ఓసీల్లో మరింత అధికం
జిల్లాలోని జలాశయాల్లో నీరు రోజురోజుకూ తగ్గుతోంది. వాగులు, ఒర్రెలు, చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతం యాసంగి వరికోతలు ప్రారంభం కాగా వ్యవసాయ కూలీలు అవస్థలు ప డుతున్నారు. సింగరేణి బొగ్గుగని ఏరియాల్లో ఎండవేడిమి మరింత ఎక్కువగా ఉంటోంది. ఓపెన్కాస్టుల్లో పనిచేస్తున్న కార్మికులు భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నారు. జిల్లాలో ఓపెన్ కాస్టులు, బొగ్గు గనులు, జైపూర్ విద్యుత్ కర్మాగారం ఉండడంతో అ గ్నికి అజ్యం పోసినట్లవుతోంది. ఏప్రిల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మే నెలను తలచుకుంటేనే భయమేస్తోందని జనాలు ఆందోళనకు గురవుతున్నారు.
వడదెబ్బ లక్షణాలు..
వడదెబ్బ తగిలే ముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. గమనించి జాగ్రత్తలు తీసుకుంటే ప్ర మాదం నుంచి బయటపడవచ్చు. శరీరంపై అధికంగా చెమట పట్టి కాళ్లు, చేతులు వణుకుతాయి. కళ్లు మసక బారుతాయి. కండరాల నొప్పి ఉంటుంది. మెదడులోని టైపోథిలామిస్ అనే భాగం శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. ఎండ కారణంగా వేడి ఎక్కువై నియంత్రణ కేంద్రం దెబ్బతింటుంది. దీంతో శరీరంలో వేడి నియంత్రణ లేక ప్రమాదానికి గురవుతారు. శరీరంలో నీటి శాతం, లవణాల సంఖ్య తగ్గి గుండె, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ప్రధానంగా 60 ఏళ్లు దాటిన వారి విషయంలో అప్రమత్తత అవసరం. తీవ్రమైన తలనొప్పి, కడుపునొప్పి, చర్మం పొడిబారడం, నీరసంగా ఉండటం, పసుపు పచ్చరంగులో చిక్కటి మూత్రం రావడంతో పాటు మంటగా అనిపించడం, సొమ్మసిల్లిపోవడం, మాట తడబడటం లాంటి లక్షణలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లు భావించి వైద్యుడిని సంప్రదించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆరుబయట పనిచేసేవారు తరచూ నీళ్లు తాగాలి. ఎండలోకి వెళ్లేవారు గొడుగు, టోపీ ధరించాలి. ము ఖానికి టవల్ లేదా కర్చీఫ్ చుట్టుకోవాలి. తరచూ నీళ్లు లేదా పండ్ల రసాలు తీసుకోవాలి. త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం, పండ్లు, కూరగాయలు తినాలి. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు నీటి ని తాగాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి. నిమ్మరసంలో ఉప్పు, చక్కెర కలిపి తాగా లి. ఎక్కువ వేడి గాలిలో తేమ ఎక్కువగా ఉన్న సమయంలో పనులు తగ్గించుకోవాలి. సోడియం, పొ టాషియం ఉన్న ద్రవపదార్థాలు తీసుకోవాలి. సా ధ్యమైనంత మేరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణాలు చేయాలి. వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఎండలో తిరిగి వచ్చిన వెంటనే ఎక్కువ మోతాదులో చల్లని నీరు ఒకేసారి తీసుకోకూడదు. వడదెబ్బకు గురైన వారిని చల్లని లేదా నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి. నుదుటిపై తడిగుడ్డ వేసి తుడుస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలి. బీపీ లేదా పల్స్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. గాలి ఎక్కువగా తగిలేలా చూడాలి. నీరు ఎక్కువగా తాగించాలి. అవసరాన్ని బట్టి వైద్యుడికి చూపించి తప్పనిసరిగా ప్రాథమిక చికిత్స అందించాలి.
నాలుగు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు
తేదీ గరిష్టం కనిష్టం
10 39.8 25.2
11 40.2 26.6
12 41.6 27.2
13 42.0 28.0
14 42.2 29.4


