బాసర: బాసర ఆర్జీయూకేటీలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, వివిధ విభాగాల డీన్స్ హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేడ్కర్ జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ప్లాంటేషన్ పేరుతో చెట్ల తొలగింపు
భీమారం: మండల కేంద్రం సమీపంలోని రిజర్వుఫారెస్ట్లో కొత్త ప్లాంటేషన్ పేరుతో ఉన్న చెట్లని అటవీశాఖ ప్రొక్లెయినర్లతో తొలగించే పనులు చేపట్టారు. దాదాపు 20 హెక్టార్లలో కొత్తగా మొక్కలు నాటేందుకు అటవీశాఖ ప్రతిపాదనలు చేసింది. ఈమేరకు మొక్కలు నాటేందుకు రిజర్వుఫారెస్ట్ని చదును చేసే పనులు చేపట్టింది. 20 హెక్టార్లలో రెండు ప్రొక్లెయినర్లతో చెట్లను నేల మట్టం చేస్తున్నారు. పచ్చదనం లేనిచోట మొక్కలు నాటాల్సి ఉండగా ఉన్న చెట్లని తొలగించి కొత్తగా అడవి తయారు చేసేందుకు పనులు చేపడుతున్నారు. దీంతో ఏళ్ల తరబడి నుంచి ఉన్న అనేక చెట్లు నేలకొరిగాయి. వర్షాకాలంలోపు భూమిని చదు ను చేసి తిరిగి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేశారు. పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరుతున్నా అటవీశాఖ ఉన్న పచ్చని చెట్లను ఎందుకు తొలగిస్తోందని మండలవాసులు ప్రశ్నిస్తున్నారు.


