మంచిర్యాలఅర్బన్:శ్రీరామనవమి రోజున పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం సందర్శించి శ్రీ సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించి తలంబ్రాలు పొందాలని చాలామంది భక్తులు అనుకుంటారు. కానీ అనివార్యకారణాలతో అంతదూరం వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ అద్భుత అవకాశాన్ని కల్పించింది. ప్రయాణికులకు చేరువ కావడంతో పాటు సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆర్టీసీ దృష్టి సారించింది. తాజాగా ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నిర్వహించే భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేసేందుకు బుకింగ్లను ప్రారంభించింది. కల్యాణానికి వెళ్లలేని భక్తులకు దేవతామూర్తుల పెళ్లిలో ఉపయోగించిన తలంబ్రాలు, ముత్యాలను అందుకునేలా ఏర్పాట్లు చేసింది. లాజిస్టిక్ కార్యాలయాల్లో డబ్బులు చెల్లించి వివరాలు నమోదు చేసుకుని రశీదు పొందితే ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు రానున్నాయి. సోమవారం నుంచి బుకింగ్ ప్రారంభమైనట్లు అధికారులు ప్రకటించారు.
దేవాదాయశాఖ సహకారంతో..
దేవాదాయశాఖ సహకారంతో చేపట్టనున్న తలంబ్రాల బుకింగ్లు సోమవారం వారం నుంచి ప్రారంభించారు. తలంబ్రాలు కావాల్సిన భక్తులు ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆదివారం మంచిర్యాల డీఎం శ్రీనివాసులు, అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, సూపరింటెండెంట్ రాజబాబు, సీనియర్ అసిస్టెంట్ మహేందర్, కార్గో ఇన్చార్జి బొలిశెట్టి రమేశ్ ఆవిష్కరించారు. భక్తులు నేరుగా లేదా ఆర్టీసీ (www.tsrtclogistics.co,in) వెబ్సైట్లో ప్రసాదాలు బుక్ చేసుకోవచ్చు.
తలంబ్రాలకు ఆదరణ..
గతేడాది ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భద్రాచలం తలంబ్రాలను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి భక్తుల నుంచి ఆదరణ లభించింది. కల్యాణానికి వెళ్లలేని భక్తులు తలంబ్రాలను అందుకునేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా లా జిస్టిక్స్ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేవాలయాలు, ఇతరత్రా చోటుకు వెళ్లి ఆర్టీసీ యా జమాన్యం తలంబ్రాల పంపిణీపై విస్తృత ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా రూ.116 చెల్లించి త మ వివరాలు నమోదు చేయించుకుని రశీదు పొంది తే ఇంటి వద్దకే తలంబ్రాలను పంపించింది. అత్యధికంగా బుకింగ్ చేయడం, ఆదాయం సమకూర్చడంలో అప్పట్లో ఆదిలాబాద్ రీజియన్ నెంబర్గా నిలిచింది.
గతేడాది రాములోరి తలంబ్రాల
బుకింగ్లు, ఆదాయం
డిపో బుకింగ్స్ ఆదాయం (రూ.ల్లో)
ఆదిలాబాద్ 1,304 1,64,304
మంచిర్యాల 1,398 1,76,148
నిర్మల్ 813 1,02,438
భైంసా 428 53,928
ఆసిఫాబాద్ 270 34,020
ఉట్నూర్ 139 17,514
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
ఆదిలాబాద్, ఉట్నూర్ 9154298531
భైంసా, నిర్మల్ 9154298547
ఆసిఫాబాద్ 9154298541
రీజినల్ మేనేజర్ కార్యాలయం 9154298553
మంచిర్యాల 9154298541, 9866771482
సద్వినియోగం చేసుకోవాలి
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా నేరుగా భక్తుల ఇంటికి అందించనున్నాం. అత్యంత వైభవంగా నిర్వహించే భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం చేపట్టిన తలంబ్రాల పంపిణీని ఉమ్మడి జిల్లాలోని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. సమీపంలోని డిపో లాజిస్టిక్, ఏజెంట్లు, ఆర్టీసీ సిబ్బందిని సంప్రదించి రూ.151 చెల్లించి బుక్
చేసుకోవచ్చు. – భవానీ ప్రసాద్,
ఆర్టీసీ ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్


