● స్వర్ణాభరణ అలంకరణలో వేంకటేశ్వరస్వామి దర్శనం
● కొనసాగుతున్న ప్రత్యేక హోమాలు..
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారిని స్వర్ణాభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన శ్రావణమాస పూజా కార్యక్రమాల్లో భాగంగా హనుమద్దాసుల మండపంలో ప్రతిరోజూ ప్రత్యేక హోమం నిర్వహిస్తున్నారు. శుక్రవారంతో పాటు బుధ, గురువారాల్లోనూ అభిషేకాలు చేస్తున్నారు. శ్రావణమాసం సందర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, వేదపండితులు పాల్గొంటున్నారు.
వీరభద్రస్వామికి అఖండ దీపారాధన
దేవస్థాన ఆవరణలోని క్షేత్రపాలకుడు శ్రీ వీరభద్రస్వామికి శ్రావణమాసం రెండో సోమవారం అఖండ దీపారాధన ప్రారంభించారు. 41 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అనంతరం సోమవారం స్వామివారికి అగ్నిగుండం ఏర్పాటు చేయనున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.


