పాలమూరు: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పచ్చదనం పెంపునకు మంగళవారం సామూహిక వనమహోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వ శాఖలు, గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి, వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అధికారులు ఆదేశించారు.
697 ప్రాంతాల్లో భారీగా నాట్లు
ఈ ఏడాది జిల్లాలో 50.82 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు 27.17 లక్షలు నాటారు. మంగళవారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 697 ప్రాంతాల్లో ఒకేరోజు 1.10 లక్షల మొక్కలు నాటనున్నారు. ఇందులో 10 ప్రాంతాల్లో ప్రత్యేకంగా భారీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నర్సరీల నుంచి ఇప్పటికే మొక్కలను సేకరించారు.
● మహబూబ్నగర్లోని అప్పన్నపల్లి సమీపంలోని క్షయ ఆస్పత్రి రోడ్డులో ప్రధాన వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి.జానకి, మేయర్, డిప్యూటీ మేయర్లు పాల్గొననున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు కోరారు.
ఒకే రోజు 1.10 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
క్షయ ఆస్పత్రి రోడ్డులో ప్రధాన కార్యక్రమం
హాజరుకానున్న జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు


