పాలమూరు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టులో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఈశ్వరయ్య, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, అదనపు అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి శశిబాబు కలిసి ప్రత్యేక బెంచ్ ద్వారా లోక్ అదాలత్ నిర్వహించారు. దీంట్లో మొత్తం 225 కేసులు బెంచ్పైకి రాగా 14 కేసులు పరిష్కరించారు. ఈ కేసుల్లో రూ.2,03,830లను బాధితులకు అందించారు. రాజీమార్గంలో త్వరితగతిన కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని న్యాయమూర్తి చెప్పారు. ఇరుపక్షాలకు సమయం, డబ్బు రెండు పూర్తిగా ఆదా అవుతాయన్నారు.
రేపటినుంచి ఆటోల బంద్
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు సోమవారం నుంచి చేపట్టే ఆటోవాలాల నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని జేఏసీ నా యకులు కోరారు. ఈ మేరకు శనివారం ఆటో సంఘాల జేఏసీ, సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో నగరంలో ఆటోలతో ర్యాలీ తీసి.. తెలంగాణ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు శ్రీనివాసులు, కురుమూర్తి, వెంకటేష్, సురేష్, బాబుమియ్యా మాట్లాడుతూ ఆటోలపై ఆధారపడి వేలాది మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. కానీ, ఆటోవాలాల పొట్ట కొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించాలని, ఏడాదికి ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న రూ.12 వేలు ఇవ్వాలని, ఓలా, ఉబర్ ర్యాపిడోలను ఉపసంహరించి.. ప్రభుత్వమే ఒక కొత్త యాప్ను ఏర్పాటు చేయాలని, ఆటోలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలుచేయాలని తదితర డిమాండ్లతో సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు వివరించారు.
బైలాస్ ప్రకారమే..
క్రీడా సంఘాల ఎన్నికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాలో ఎన్నికలు నిర్వహించని క్రీడా సంఘాలు బైలాస్ ప్రకారం ఎన్నికలు పూర్తి చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ సూచించారు. శనివారం ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 20 క్రీడా సంఘాలు ఉండగా.. ఐదారు మాత్రమే చురుగ్గా ఉన్నాయని తెలిపారు. ఎన్నికలు నిర్వహించని సంఘాలు వచ్చే నెల 25లోపు ఎన్నికలు పూర్తి చేసి, సంబంధిత పత్రాలను ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం, జిల్లా యువజన, క్రీడల శాఖకు అందజేయాలన్నారు. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్తో పాటు రాష్ట్ర అసోసియేషన్ అఫిలియేషన్ పత్రాలు సమర్పించాలని సూచించారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం అఫిలియేషన్ ఉన్న సంఘాలకే స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఆర్థిక సహకారం, మైదానాల్లో క్రీడల నిర్వహణకు అనుమతులు లభిస్తాయని స్పష్టం చేశారు. సమావేశంలో ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, కోశాధికారి ఉమామహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.


