మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలో గతేడాది ప్రారంభమైన బాసర ట్రిపుల్ ఐటీకి సొంత భవనం లేకపోవడంతో విద్యార్థులకు వసతి, తరగతుల నిర్వహణ కష్టంగా మారింది. గతేడాది బండమీదిపల్లిలోని రెడ్డి హాస్టల్లో తరగతులు, వసతి ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది రెండో బ్యాచ్ విద్యార్థులు చేరడంతో వారికి బీకేరెడ్డి కాలనీలోని మరో భవనాన్ని కేటాయించారు. దీంతో ఏటా వేర్వేరు భవనాల్లో కళాశాల నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రిపుల్ ఐటీ శాశ్వత భవన నిర్మాణం కోసం జడ్చర్ల సమీపంలో 43 ఎకరాల స్థలాన్ని కేటాయించి గతేడాది శంకుస్థాపన చేశారు. తొలివిడతలో రూ.200 కోట్లు కేటాయించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. దీంతో రెండు బ్యాచ్ల విద్యార్థులకు వేర్వేరు భవనాలు, ల్యాబ్లు, హాస్టళ్లు, మెస్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పీయూసీ–1లో 200 మంది, పీయూసీ–2లో 203 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు బ్యాచ్లకు వేర్వేరుగా వసతులు కల్పించాల్సి రావడంతో యాజమాన్యంపై అదనపు భారం పడుతోంది. సొంత భవనం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
కొత్త భవనంలోనే తరగతులు
ఈ ఏడాది చేరిన పీయూసీ–1 విద్యార్థులకు బీకేరెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన కొత్త భవనంలో తరగతులు ప్రారంభం కానున్నాయని సీనియర్ అధ్యాపకులు శ్రవణ్కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం నుంచి పేరెంట్స్–స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్తో పాటు అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో రెండు మెస్లు, రెండు ల్యాబ్లతో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
సొంత భవనం లేక.. ఏటా కొత్త భవనాల్లో తరగతులు
గతేడాది రెడ్డి హాస్టల్.. ఈసారి బీకేరెడ్డి కాలనీలో తరగతులు, వసతి
నేటి నుంచి రెండో బ్యాచ్కు పేరెంట్స్–స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం


