జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): విజయ డెయిరీ పెంచిన పాల కొనుగోలు ధరలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా సూచించారు. గురువారం కలెక్టరేట్లో విజయ డెయిరీ పెంచిన పాల ధరలకు సంబంధించిన కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ డి.సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ.. బర్రె పాల ధరను లీటరుకు రూ.6, ఆవు పాల ధరను రూ.2 చొప్పున పెంచినట్లు తెలిపారు. పెంచిన ధరలు ఈ నెల 16 నుంచి అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. పాడి రైతులకు ప్రతి 15 రోజులకు పాల బిల్లుల చెల్లింపుతో పాటు పశువులకు బీమా, తక్కువ ధరకే నాణ్యమైన పశుదాణా, కాల్షియం, మినరల్ మిక్చర్, నట్టల నివారణ మందులు, గడ్డి విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు. పాడి పశువుల కొనుగోలుకు యూనియన్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా రుణ సదు పాయం కల్పిస్తున్నామని చెప్పారు. మధ్య వర్తులను ఆశ్రయించకుండా విజయ డైయిరీ సేకరణ కేంద్రాల్లోనే పాలు విక్రయించి పెంచిన ధరతో పాటు ఇతర సదుపాయాలను రైతులు పొందాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శివానందస్వామి, డీఆర్డీఓ నర్సింహులు, డెయిరీ మేనేజర్ యాకన్న తదితరులు పాల్గొన్నారు.


