బిజినేపల్లి: వ్యవసాయంలో మానవ శ్రమను తగ్గించడంతో పాటు ప్రజల ఆరోగ్యం పెంచే పంటల్లో అధిక దిగుబడులు వచ్చేలా నూతన వంగడాలను సృష్టించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. వాతావరుణ మార్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని తట్టుకునే పంటఽలు, సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. గురువారం పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానంలో దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులకు లాభదాయక పంటల వైపునకు తరలించే విధంగా శాస్త్రవేత్తలు వ్యవసాయ వంగడాలను రూపొందించాలని కోరారు. రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచే విధంగా శాసీ్త్రయ బద్ధ పంటల సాగుకు అనువైన పరిస్థితులను కల్పించుకోవాలన్నారు. పాలెం ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డా.ఎల్.కృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరంలో వరిలో అభివృద్ధి చేసిన ఆర్ఎన్ఆర్ 25105, 31479 రకాల్లో అధిక దిడుబడి, తక్కువ నూకశాతం కలిగిన వంగడాల గురించి వివరించారు. అలాగే వేరుశనగలో నాణ్యమైన విత్తనాల ప్రాధాన్యతను వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డా. బలరాం మాట్లాడుతూ యూరియా సమగ్ర వినియోగం, చిరుదాన్యాల ప్రోత్సాహం, అడవి పందులు, కోతుల వంటి జంతువుల వలన కలిగే నష్టాన్ని నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమావేశంలో శాస్త్రవేత్తలు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.


