53వ డివిజన్పై హై‘డ్రామా’
● ఒక్క ఓటుతో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్
● అర్ధరాత్రి దాటిన తర్వాతఫలితం ప్రకటన
పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మొత్తం 60డివిజన్లలో కాంగ్రెస్ 29, బీఆర్ఎస్ 15, బీజేపీ 8, ఎంఐఎం ముగ్గురు, స్వతంత్రులు ఐదుగురు గెలుపొందారు. అయితే 53వ డివిజన్ ఫలితాలపై అర్ధరాత్రి వరకు హైడ్రామా సాగింది. మొదటి కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి రాఘవేందర్కు 816, బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్కు 815 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ రీకౌంటింగ్ కోరడంతో అధికారులు మళ్లీ లెక్కింపు నిర్వహించారు. దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి రెండు ఓట్లు పెరిగి 818కి, బీజేపీ అభ్యర్థికి నాలుగు ఓట్లు పెరగడంతో 819కి చేరింది. దీంతో బీజేపీ అభ్యర్థి ఒక్క ఓటు ఆధిక్యం సాధించాడు. మూడోసారి జరిగిన రీకౌంటింగ్లో కాంగ్రెస్కు 818, బీజేపీ 819 ఓట్లు రావడంతో.. ఒక్క ఓటుతో బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్ను గెలుపొందినట్లు కమిషనర్ రామానుంజులరెడ్డి వెల్లడించారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాతనే రమేష్ గెలుపొందినట్లు ప్రకటించారు.
నలుగురు వెయ్యి ఓట్లకు పైగా..
ఎనిమిది మంది 25 ఓట్ల లోపే..
మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఉన్న 59 డివిజన్లలో పోలింగ్ జరగగా.. నలుగురు అభ్యర్థులు వెయ్యికి పైగా ఓట్లతో విజయం సాధించారు. అత్యధికంగా 13వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి షేబానా బేగం మోసిన్ 1,152 ఓట్లతో విజయం సాధించగా.. 23వ డివిజన్లో కాంగ్రెస్అభ్యర్థి బీసం వరలక్ష్మీ 1,138 ఓట్లతో, 27వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి అతీర్ హాబీబా ఫయాజ్ 1,109 ఓట్లతో, 8వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి సరస్వతి 1,023 ఓట్లతో విజయం సాధించారు.
● ఇక అత్యల్ప మెజార్టీ విషయానికి వస్తే 53వ వార్డులో రమేష్ ఒక్క ఓటుతో విజయం సాధించగా.. 12వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి రఘుపై బీఆర్ఎస్ అభ్యర్థి కుర్వ సత్యం 8 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 9వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి హైందవి 14ఓట్లతో, 56వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి సువర్ణ 17 ఓట్లతో 35వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి షబీనా బేగం 20 ఓట్లతో, 40వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి సీబీ పూజిత 20 ఓట్లతో, 44వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్రెడ్డి 22 ఓట్లతో, 28వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి నస్రీన్ 22 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
రమేష్కుమార్


