
అనుమతి మేరకే నిర్మాణాలు చేపట్టాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో ఇళ్లు, బహుళ అంతస్తులు, ఇతర వాణిజ్య సముదాయాలను మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల మేరకే అనుమతి తీసుకుని నిర్మించుకోవాలని ప్రజలకు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ సూచించారు. బుధవారం ఉదయం స్థానిక మైత్రినగర్ నుంచి ఎంవీఎస్ డిగ్రీ కళాశాల వరకు క్షేత్రస్థాయి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ నిర్మాణాలు పూర్తయి ఇంతవరకు ఆస్తిపన్ను చెల్లించని, ఇంటి నంబరు తీసుకొని వారు వెంటనే మున్సిపల్ కార్యాలయంలో అసెస్మెంట్ చేసుకోవాలన్నారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపడితే బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రెయినేజీ వ్యవస్థను, తాగునీటి పైపులైన్లలో లీకేజీలను సరిచేయాలన్నారు. స్వచ్ఛ ఆటోలకు తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వని వారిని గుర్తించాలన్నారు. ఎక్కడబడితే అక్కడ వీధుల వెంట, ఓపెన్ ప్లాట్లలో చెత్తాచెదారం వేయొద్దన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, డీఈఈ నరసింహ, ఏఈఈ వైష్ణవి, టీపీఓ లక్ష్మీపతి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్