రైతుభరోసా @ రూ.184.17 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రైతుభరోసా @ రూ.184.17 కోట్లు

Jun 21 2025 3:03 AM | Updated on Jun 21 2025 3:03 AM

రైతుభరోసా  @ రూ.184.17 కోట్లు

రైతుభరోసా @ రూ.184.17 కోట్లు

జిల్లాలో 1,97,093 మందిఖాతాల్లో జమ

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): వానాకాలం పెట్టుబడి సాయానికి సంబంధించి రైతుభరోసా డబ్బులు శుక్రవారం ఉదయం 10 గంటల వరకు జిల్లాలో 1,97,093 మంది రైతులకు రూ.184.17 కోట్లు ఖాతాల్లో జమ అయ్యాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేష్‌ తెలిపారు. విడతల వారీగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 16 నుంచి 20 ఉదయం 10 గంటల వరకు రైతు భరోసా కింద ప్రభుత్వం ఐదు ఎకరాలలోపు రైతుల ఖాతాలకు నిధులు జమ చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 2,54,059 మంది అర్హులైన రైతులకు రూ.255.48 కోట్లు రైతు భరోసా నిధులు విడుదలకు ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇందులో 5 ఎకరాల లోపు 2,08,486 మంది రైతులకు సంబంధించి రూ.230.08 కోట్ల ట్రెజరీకి పంపగా, రైతుల ఖాతాలకు రూ.184.17 కోట్లు జమ అయ్యాయన్నారు. వానాకాలం సాగు ప్రారంభానికి ముందే ప్రభుత్వం రైతు భరోసా నిధులు అందించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెడికల్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు

పాలమూరు: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో జాతీయ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ పథకం కింద ఏడాది పాటు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేయడానికి ఐదు మెడికల్‌ ఆఫీసర్ల (ఎంబీబీఎస్‌) పోస్టులు భర్తీ చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ కృష్ణ శుక్రవారం ఒక ప్రకలనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 22 నుంచి 28 వరకు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

కోయిల్‌సాగర్‌లో 17 అడుగుల నీటిమట్టం

దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ నీటిమట్టం శుక్రవారం సాయంత్రం వరకు 17 అడుగులకు చేరింది. జూరాల నుంచి ఒక పంపును రన్‌ చేసి నీటిని విడుదల చేస్తుండటంతో నీటిమట్టం ప్రతిరోజు కొంత మేర పెరుగుతోంది. జూరాల నీరు రాక ముందు 11 అడుగులుగా ఉన్న నీటిమట్టం 6 అడుగులు పెరిగి 17 అడుగులకు చేరింది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా మరో 9.6 అడుగులు నీరు చేరితే పాత అలుగు స్థాయికి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్ల లెవల్‌ వరకు 32.6 అడుగులు. మరో 15.6 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది.

మొక్కజొన్న క్వింటాల్‌ రూ.2,267

జడ్చర్ల: పట్టణంలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శుక్రవారం మొక్కజొన్న క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,267, కనిష్టంగా రూ.1,531 ధరలు లభించాయి. అలాగే ఆముదాలు గరిష్టంగా రూ.6,385, కనిష్టంగా రూ.6,375, ధాన్యం హంస రకం గరిష్టంగా రూ.1,719, కనిష్టంగా రూ.1,679, ఆర్‌ఎన్‌ఆర్‌ గరిష్టంగా రూ.2,129, కనిష్టంగా రూ.1,652 చొప్పున ధరలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement