
మున్సిపల్ వ్యవస్థ ఎంతో కీలకం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో.. పట్టణాలు, నగరాలకు మున్సిపల్ వ్యవస్థ అంతే ముఖ్యమని సీడీఎంఏ టీకే శ్రీదేవి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో ‘తెలంగాణ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్– స్టార్టప్ సమ్మిట్’ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ‘వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ’లో చేసే పనులు వినూత్నంగా ఉండాలన్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ, నీటి శుద్ధికి సంబంధించి కొత్త ఆవిష్కరణలతో వివిధ స్టార్టప్ కంపెనీలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వీటిని ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలని, అందరూ వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. మున్సిపాలిటీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడకుండా స్థానికంగా ఆర్థిక వనరులు పెంచుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సు ఫీజు, దుకాణాల అద్దెలను సకాలంలో వసూలు చేసి ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడు తూ పట్టణాలు, నగర ప్రాంతాల్లో వేస్టేజీ ఎక్కువగా ఉంటోందని దీనివల్ల వాతావరణ, నీటి, వాయు కాలుష్యం ఉత్పన్నమవుతోందన్నారు. వీటిని తగ్గించడానికి కొత్త ఆవిష్కరణలపై అధ్యయనం చేసి అమలయ్యేలా చూస్తామన్నారు. అంతకు ముందు శిల్పారామం ఆవరణలో ఏర్పాటు చేసిన 40 స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ మహేశ్వర్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సుకు రాష్ట్రంలోని వంద మందికి పైగా మున్సిపల్ కమిషనర్లు హాజరై కొత్త ఆవిష్కరణలను క్షుణ్ణంగా పరిశీలించారు.
సీడీఎంఏ టీకే శ్రీదేవి
శిల్పారామంలో ‘తెలంగాణ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్– స్టార్టప్ సమ్మిట్’