చారకొండ: రాష్ట్రంలోనే రెండో అపర భద్రాదిగా.. భక్తులు కోరిన కోరికలు తీర్చే సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. బుధవారం నుంచి వచ్చేనెల 4 వరకు వారంరోజులపాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రతి ఏటా శ్రీరామ నవమిని పురస్కరించుకొని వేడుకలను కనుల పండువగా నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రం నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిర్సనగండ్ల పంచాయతీ పరిధిలోని అయోధ్యనగర్ (గుట్ట)పైన సుమారు 60 ఎకరాల్లో 300 అడుగుల ఎత్తైన ఏకశిలపై వెలసింది. బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి పాలమూరు నుంచే కాక.. రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. శ్రీరామ నవమి రోజున భద్రాచలం మాదిరిగానే ఇక్కడ కూడా ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కల్యాణం జరిపిస్తారు.
అన్ని ఏర్పాటు పూర్తి..
వారంరోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. గురువారం జరిగే కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఇందుకు గాను ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు. తాగునీటి ట్యాంకర్లు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు బుధవారం మధ్యాహ్నం మాస కల్యాణం, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణోత్సవం ఉంటుంది. శుక్రవారం ఉదయం కుంకుమార్చన, రాత్రి చిన్నరథం (పూలతేరు), శనివారం శివదత్తాత్రేయ పరశురామ, పోచమ్మ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం అభిషేకం అర్చనాదులు, రాత్రికి పెద్దతేరు (రథోత్సవం), సోమవారం, పల్లకీసేవ, అభిషేకం, నాగబలి, దీపోత్సవం, మంగళవారం ప్రత్యేక పూజలు, పల్లకీసేవ, ఏకాంత సేవ తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ రఘు తెలిపారు.
కార్యక్రమాలు ఇలా..
అపరభద్రాద్రిగా పేరుగాంచిన రాములోరి ఆలయం
ఏకశిలపై వెలసిన
సీతారామచంద్రస్వామి
నేటి నుంచి వారంరోజులపాటు కొనసాగనున్న ఉత్సవాలు
ప్రభుత్వ లాంఛనాలతో కల్యాణోత్సవం
ఏర్పాట్లు పూర్తిచేసిన
అధికార యంత్రాంగం
ప్రత్యేక బస్సులు..
బ్రహ్మోత్సవాలకు మహబూబ్నగర్, నల్ల గొండ, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి తరలివచ్చే వేలాది మంది భక్తుల కోసం కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు.