పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా నిర్వహించాలి

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

తొర్రూరు: ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని జనగామ జిల్లా అదనపు కలెక్టర్‌, పాలకుర్తి నియోజకవర్గ ప్రత్యేక అధికారి బెన్‌షాలోమ్‌ సూచించారు. శుక్రవారం మండల రెవెన్యూ కార్యాలయంలో సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. బీఎల్‌ఓలు ఇంటింటకీ వెళ్లి కొత్త ఓటరు గణన, పేర్లు, చిరుమానాలు, ప్రాంతాల మార్పులు, మరణించిన, అనర్హత ఓటర్ల తొలగింపు వంటి సవరణలు చేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ తహసీల్దార్‌ నర్సయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రవీణ్‌రెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు, జీపీఓలు పాల్గొన్నారు..

నేడు శనిత్రయోదశి పూజలు

హన్మకొండ కల్చరల్‌: శనిత్రయోదశి పుస్కరించుకుని శనివారం ఉదయం 5 గంటల నుంచి శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనిపూజలు, నవగ్రహ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ అనిల్‌కుమార్‌, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఏలిననాటి శని, అష్టమ శని గ్రహప్రభావాలతో బాధపడుతున్న వారు పూజల్లో పాల్గొనాలని, తైలాభిషేకాలు, తిల పూజలు, తిల దానాలు, వస్త్రదానాలు చేసి శని పీడ నుంచి విముక్తులు కావొచ్చని వారు పేర్కొన్నారు.

భర్తీ ఎప్పుడు?

సీకేఎంలో ఇంకా ఖాళీగా

ఆర్‌ఎంఓ పోస్టు

కాశిబుగ్గ: వరంగల్‌ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో ఆర్‌ఎంఓ పోస్టు భర్తీ కావట్లేదు. గత మూడు నెలల నుంచి ఈ అధికారి పోస్టు భర్తీ కాకపోవడంతో ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎంఓలు బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. ఆర్‌ఎంఓ స్థాయి అధికారి లేకపోవడం వల్ల వైద్యసేవలు, అడ్మినిస్ట్రేషన్‌ పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

బదిలీల్లో పీజీ విద్యార్థికి ఆర్డర్‌..

ఇటీవల జరిగిన బదిలీల్లో సీకేఎం ఆస్పత్రి ఆర్‌ఎంఓగా ఓ పీజీ విద్యార్థినికి ఆర్డర్‌ ఇవ్వడం అయోమయానికి గురిచేసింది. సంగారెడ్డి జిల్లా ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కళాశాలలో గైనిక్‌లో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న డాక్టర్‌ గీతాలక్ష్మికి ఆర్‌ఎంఓగా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అధికారులు ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వీస్‌ కోటాలో ఓబీజీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థినికి ఆర్‌ఎంఓగా ఎలా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ హోదాల్లో ఆర్‌ఎంఓగా విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. గైనిక్‌ కోర్సు పూర్తి చేయనివారికి ఎలా ఆర్డర్‌ ఇచ్చారని సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె ఇక్కడ రిపోర్టు చేయకుండానే తిరిగి డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అధికారులకు వివరించినట్లు సమాచారం.

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించాలి

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం: డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ మాదకద్రవ్యాల దుర్విని యోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సెంట్రల్‌ జోన్‌ పోలీసులు కమిషనరేట్‌ కార్యాలయం నుంచి ఆర్ట్స్‌ కళాశాల మైదానం వరకు ఏర్పాటు చేసిన 2కే రన్‌ను కలిసి సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి పోవద్దని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి, వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్‌ బాజ్‌పాయ్‌, కుడా చైర్మన్‌ ఇనగాల వెంట్రాంరెడ్డి, డీసీపీలు ధార కవిత, అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement