మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధి కొత్త బజార్ వైపు వాహనాల పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మూడో నంబర్ ప్లాట్ ఫారం వైపున ఉన్న ఖాళీ ప్రదేశం మొత్తం తమ పరిధిలోకి వస్తుందంటూ ప్రయాణికుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులను రైలెక్కిచ్చి వచ్చేలోపు తమ వాహనాలను గొలుసులు, తాళ్లతో కట్టిపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
నో పార్కింగ్ పేరిట..
నో పార్కింగ్ పేరిట ఇష్టం వచ్చినట్లు బోర్డులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో వాహనాలు నిలిపినవారిని నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రయాణికులు తెలిపారు. రైల్వే పార్కింగ్ స్థలానికి కేటాయించిన ప్రదేశం కంటే అధిక మొత్తంలో స్థలాన్ని ఆక్రమించి ఎక్కడ కూడా వాహనాలు పార్కింగ్ చేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం రైల్వే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ తమ వాహనాన్ని పార్కింగ్ చేసి వెళ్లి వచ్చేలోగా గొలుసులు, తాళ్లుకట్టి పెడితే ఆయన పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమిటని అడిగితే తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, రైల్వే శాఖ ఉన్నతాధికారులు స్పందించి నో పార్కింగ్ పేరిట డబ్బుల వసూళ్లు, పార్కింగ్ స్టాండ్ నిర్వహణ విషయంపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
వాహనాలు నిలుపనివ్వటం లేదు
రైల్వే స్టేషన్ ఆవరణలోని పార్కింగ్ స్టాండ్ సమీపంలో ప్రయాణికులు ద్విచక్ర వాహనాలు, కార్లు తీసుకుని వస్తే ఇక్కడ నిలుపనివ్వడంలేదు. ప్రయాణికులు వచ్చివెళ్లేలోగా గొలుసులు, తాళ్లతో కట్టిపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే దౌర్జన్యంగా వ్యవహరిస్తూ పార్కింగ్ మొత్తం తమ పరిధిలోకి వస్తుందని బెదిరిస్తున్నారు. టికెట్లు కొనుగోలు చేసి వచ్చేసరికి వాహనాలు ఇక్కడి నుంచి తీసేయాలని అంటున్నారు.
–గిద్దల రమేశ్, పర్వతగిరి
రైల్వే స్టేషన్లో ప్రయాణికులు,
వారి బంధువుల ఇబ్బందులు
పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులు దౌర్జన్యం చేస్తున్నారని వాహనదారుల ఆరోపణ
నో పార్కింగ్ పేరిట వసూళ్లు


