● 170 మంది కేటాయింపు
కాశిబుగ్గ: ఎట్టకేలకు ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులొచ్చారు. దవాఖానా నుంచి బదిలీ అయిన వారి స్థానంలో కొత్తగా ఎవరూ జాయిన్ అవకపోవడంతో తొలుత అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో నర్సింగ్ సూపరింటెండెంట్ దయాశీల, డిప్యూటీ సూపరింటెండెంట్ సుజాత అధికారుల ఆదేశాల మేరకు ఎంజీఎంలో పేషెంట్లకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు బీఎస్సీ, జనరల్ నర్సింగ్, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి నర్సింగ్ స్టాఫ్ను రప్పించారు. స్టాఫ్ నర్సుల స్థానంలో వీరు ప్రత్యామ్నాయంగా సేవలందిస్తున్నారు.
ఖాళీగా 284 పోస్టులు
ఎంజీఎం దవాఖనాలో రోగులకు సేవలు అందించడానికి 478 మంది స్టాఫ్నర్సులు అవసరం ఉండగా.. కేవలం 194 మందితో వైద్యసేవలు అందిస్తున్నారు. మరో 284 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. ఎంజీఎంలో పేషెంట్ల సేవల కోసం స్టాఫ్ నర్సుల (నర్సింగ్ ఆఫీసర్లు) కొరత గుర్తించిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు బదిలీ అయిన వారి స్థానంలో 170 మంది నర్సింగ్ ఆఫీసర్లను కేటాయించారు. అలాగే హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఐదుగురు స్టాఫ్ నర్సులను అలాట్ చేసినట్లు తెలుస్తోంది. 2024 సంవత్సరం బ్యాచ్కు సంబంధించిన వీరు రెండు రోజుల నుంచి ఎంజీఎంలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటి వరకు 60 మంది స్టాఫ్ నర్సులు జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. మిగతావారు కూడా సోమవారం వరకు జాయిన్ కావొచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎంజీఎంలోని అత్యవసర చికిత్సలు, పలు వార్డుల్లో నర్సింగ్ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది.


