చిట్యాల: నీటితొట్టెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలంలోని తిర్మలాపూర్లో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కంచు మౌనిక–బీరన్న దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, బీరన్న తన గొర్రెలమందను మేతకోసం గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. మందలోని ఒక గొర్రెపిల్లకు పాము కరవడం గమనించి ఆయన భార్య మౌనికకు సెల్ఫోన్ ద్వారా సమాచారం అందించి మందులు, ఇంజక్షన్లు పంపించమని చెప్పాడు. దీంతో ఆమె తన బంధువుల ద్వారా గొర్రెలమంద వద్దకు మందులు పంపించింది. పాము కరిచిన గొర్రెపిల్ల ఎలా ఉందని తెలుసుకునేందుకు మౌనిక పక్కింటికి వెళ్తుండగా.. కూతురు హాన్వి ఆమె వెనుకే వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో కూతురు కనిపించలేదు. చుట్టు పక్కల వెతికినా చిన్నారి ఆచూకీ తెలియలేదు. తన ఇంటి ఎదుట ఉన్న నీటి తొట్టెలో చూడగా కనిపించింది. దీంతో ఆమె కేకలు వేస్తూ కూతురు హాన్విని బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


