పచ్చళ్ల తయారీ కేంద్రంపై దాడి | - | Sakshi
Sakshi News home page

పచ్చళ్ల తయారీ కేంద్రంపై దాడి

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

కాశిబుగ్గ: వరంగల్‌ కాశిబుగ్గలో అపరిశుభ్ర వాతావరణంలో పచ్చళ్లు తయారు చేస్తూ, నిల్వ ఉంచుతున్న కేంద్రంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపు దాడి చేశారు. గురువారం ఇంతెజార్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కాశిబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ గృహంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున కుళ్లిన పచ్చడి ముడి సరుకులు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వీటిని చిన్న ప్యాకెట్లలో ప్యాక్‌ చేసి స్థానిక కిరాణా షాపులు, ఇతర చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అరికెల శ్రీనివాస్‌ను అదుపులో తీసుకున్నారు. అలాగే, 750 కిలోల టమాట, 900 కిలోల మామిడి, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం–వెల్లుల్లి ఫేస్ట్‌తో కూడిన మొత్తం రూ.2,25, 000 విలువైన కుళ్లిన కల్తీ ఆహార నిల్వ లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పట్టుబడిన వ్యక్తిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చర్యల నిమిత్తం ఇంతెజార్‌గంజ్‌ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు. దాడిలో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ఎ.మధుసూదన్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ బండారి రాజు, ఆర్‌ఎస్సై భానుప్రకాశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

రూ.2.25 లక్షల కల్తీ నిల్వలు

స్వాధీనం చేసుకున్న పోలీసులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement