మహబూబాబాద్: విద్యా ప్రమాణాలు పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల ముఖగుర్తింపు హాజరు, తదితర విషయాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాలన్నారు. ఈనెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, దాని లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మూతబడిన పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని, ఇందుకు సమయపాలన ముఖ్యమన్నారు. ఎఫ్ఆర్ఎస్ ద్వారా రోజువారి హాజరు నమోదు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బోధన పద్ధతులపై ఉపధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇంగ్లిష్ భాషపై విద్యార్థులు పట్టు సాధించాలన్నారు. సమావేశంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహశబరీష్


