మహబూబాబాద్ రూరల్ : రైతులకు యాప్ ద్వారా మాత్రమే యూరియా ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ బి.గోపి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా యాప్ ద్వారా రైతులకు సరఫరా విధానం అమలు, వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న పథకాల తీరు, ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడిన వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు, పంటల మార్పిడి, అపరాల సాగు పెంపుపై సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని రైతువేదిక కార్యాలయం నుంచి డీఏఓ ఎస్.విజయచంద్ర, మరిపెడ ఏడీఏ శ్రీదేవి, టెక్నికల్ ఏడీఏ మురళి, అన్ని మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.


