మహబూబాబాద్: లోతట్టు, వరద ముప్పు ప్రాంతాలను గుర్తించాలని మానుకోట మున్సిపల్ కమిషనర్ వినోద్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం వర్షాకాలం సన్నద్ధతపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నీరు నిల్వ కాకుండా కాల్వలను శుభ్రం చేయాలన్నారు. అత్యవసర స్పందన బృందాలు, రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రమాదకరమైన చెట్లు తొలగించాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ ఉపేందర్, అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ మూడురోజులు బంద్
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ మూడు రోజులు బంద్ ఉంటుందని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ బుధవారం తెలిపారు. ఈ నెల 26న శుక్రవారం మొహర్రం పండుగ, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని పేర్కొన్నారు. రైతులు సోమవారం వ్యవసాయ మార్కెట్ యార్డుకు తమ పంట ఉత్పత్తులు తీసుకురావాలని సూచించారు.
అడవులు, జంతువుల రక్షణకు సహకరించాలి
గూడూరు: గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో అడవులు, జంతువుల రక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఫారెస్ట్ డెవలప్మెంట్ అధికారి (ఎఫ్డీఓ) వెంకటేశ్వర్రావు అన్నారు. మండల కేంద్రంలోని ఎఫ్డీఓ కార్యాలయంలో బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. మహబూబాబాద్ ఎఫ్డీఓగా విధులు నిర్వర్తిస్తున్నానని, ఉన్నతాధికారులు గూడూరు ఎఫ్డీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఎఫ్డీఓ వెంకటేశ్వర్రావుకు ఎఫ్ఆర్వో ప్రసాదరావు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పిలికారు.


