మహబూబాబాద్ రూరల్ : డీసీఎం బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని సాలార్ తండా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓ పాత ఇనుప సామాను దుకాణం నుంచి సామగ్రిని డీసీఎంలో హైదరాబాద్ తరలిస్తున్నారు. వాహనం జిల్లా కేంద్రం శివారులోని సాలార్ తండా మీదుగా వెళ్తున్న క్రమంలో ఆటో ఎదురుగా వచ్చింది. దీంతో ఆటోను తప్పించబోయి డీసీఎం అదుపు తప్పి బోల్తాపడింది. ఈఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎల్లగొండ లాలయ్య (35)గా గుర్తించారు. ఘటనాస్థలిని టౌన్ సీఐ రఘుపతిరెడ్డి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని 108లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. టౌన్ ఎస్సై శివరామకృష్ణ ఆస్పత్రిలో మృతుడి వివరాలు సేకరించారు. లాలయ్య కుటుంబ సభ్యులు వచ్చాక ఫిర్యాదు చేసిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా, మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
మానుకోట శివారులో ఘటన
మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా వాసి


