కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నాణ్యమైన విత్తనాలు వేసి రైతులు లాభాలు పొందాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మంగళవారం మండలంలోని కల్వల గ్రామ రైతువేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో 7 రకాల సన్న వరి విత్తనాలను రైతులు సాగు చేసుకుని, ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరతోపాటు బోనస్ పొందాలన్నారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయించినట్లయితే వెంటనే పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులకు తెలియజేయాలన్నారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని, నానో యూరియా, నానో డీఏపీ వాడకాన్ని పెంచాలన్నారు. అదే విధంగా డీఏఓ విజయచంద్ర మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని, రైతులు గమనించి ఆరుతడి పంటలైన పెసర, మినుములు, కందులు, జొన్నలు, కూరగాయలను సాగు చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలను, విత్తన డీలర్లు ఏర్పాటు చేసిన వరి, పెసర, జీలుగ విత్తనాలను కలెక్టర్ రైతులకు పంపిణీ చేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధి అమీనాపురంలో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో జాప్యం కాకుండా వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, కేసముద్రం పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంబటి మహేందర్రెడ్డి, తహసీల్దార్ వివేక్, ఎంపీడీఓ క్రాంతి, ఏఓ వెంకన్న, జిల్లా విత్తన డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఓలం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నివేదికలు సమర్పించాలి
మహబూబాబాద్: రోడ్డు నిర్వహణ మరమ్మతులపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు సేఫ్టీపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి వైద్యం అందించాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం ఉండాలన్నారు. సంబంధిత అధికారులు రోడ్డు మ్యాపింగ్ మార్కింగ్పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ ఎన్నికల మ్యాపింగ్లో పారదర్శకత అవసరం అన్నారు.
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠినచర్యలు..
ప్రభుత్వ భూముల ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్నేహశబరీష్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ పక్కన 255 సర్వే నంబర్ భూమిలో గుడిసెలు వేసుకున్నారన్నారు. ఆక్రమించిన భూమిని ప్రభుత్వ నిబంధనల ప్రకా రం స్వాధీనం చేసుకున్నామన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాళా ల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్
కల్వల రైతువేదికలో విత్తన మేళాకు హాజరు


