మహబూబాబాద్ రూరల్: మిర్చి, మొక్కజొన్న కొనుగోలు చేసిన వ్యాపారి రెండు నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం రైతులు ధర్నా చేపట్టారు. వెంటనే డబ్బులు చెల్లించాలని మార్కెట్ ప్రధాన గేటుకు తాళం వేసి ధర్నా చేశారు. మా డబ్బులు మాకు ఇప్పించాలంటూ నినాదాలు చేశారు. రైతులు వెంకన్న, అనిల్ కుమార్, రాంజీ, కోటేష్, కట్టయ్య, నరేష్ మాట్లాడుతూ.. మానుకోట వ్యవసాయ మార్కెట్ పరిధిలో, మార్కెట్ బయట సుమారు 40 మంది రైతుల వద్ద నుంచి ఎన్.ఎస్. ట్రేడర్స్ యజమాని శేఖర్ మిర్చి, మొక్కజొన్న కొనుగోలు చేశారన్నారు. మొత్తం రైతులకు చెందిన సుమారు రూ.40 లక్షలకుపైగా రావాల్సి ఉందన్నా రు. వెంటనే డబ్బులు ఇప్పించేలా వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం, అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ ను వివరణ కోరగా ఎన్.ఎస్.ట్రేడర్స్ యజమాని శేఖర్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. మిర్చి, మొక్కజొన్న విక్రయించిన రైతులు డబ్బులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతుల ధర్నా


