● డీఈఓ సత్యనారాయణమూర్తి
కేసముద్రం: విద్యార్థులకు ప్రాథమిక విద్యను సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం మండలంలోని కల్వల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, జెడ్పీ హైస్కూల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. ఇంగ్లిష్లో సంభాషిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం డీఈఓ మాట్లాడారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అంబటి మహేందర్రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, ఇన్చార్జ్ హెచ్ఎం ఆర్.ఏకాంబ్రం, పీఎస్ హెచ్ఎం కళ్లెం వీరారెడ్డి, పీడీ కొప్పుల శంకర్, నాగేందర్, బేతి సత్యనారాయణ, మార్గం శ్రీనివాస్, సీఆర్పీ ఉదయ్ పాల్గొన్నారు.


