మహబూబాబాద్: వరద కాల్వలను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో వరద కాల్వల నిర్మాణ స్థలాలను సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకులు వరద కాల్వలను నిర్లక్ష్యం చేయడం వల్లే వర్షాకాలంలో సమస్యలు వస్తున్నాయన్నారు. కాల్వల సమస్య పరిష్కారం కోసం రూ.12 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ ఈఈ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. కార్యాలయ భవనం స్లాబ్ పెచ్చులు ఊడడం చూసి.. నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, కౌన్సిలర్లు చిదిరాల అరుణ, బోడ రవి, డీఈ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
స్థల పరిశీలన
నెల్లికుదురు: తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటులో భాగంగా సోమవారం జాయింట్ డైరెక్టర్, ఇన్చార్జ్ ఆర్జేడీ పి.మదన్మోహన్ మండల కేంద్రంలో సోమవారం స్థల పరిశీలన చేశారు. అనంతరం డీఈఓ సత్యనారాయణమూర్తి, ఎంఈఓ, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, హెచ్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, ఈఈ అరుణ్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రకాశ్ బాబు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ మస్కపురి సుధాకర్ హెచ్ఎంలు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
దూరవిద్య పీజీ పరీక్షలు ప్రారంభం
కేయూ క్యాంపస్: కేయూ పరిధి దూరవిద్య సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ (2024–25, 2025–26 బ్యాచ్ల రెగ్యులర్ విద్యార్థులకు) అలాగే 2023–24 ఎక్స్ విద్యార్థులకు పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. వర్సిటీ పరిధిలో 16 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. హనుమకొండలో పలు పరీక్ష కేంద్రాలను కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి డాక్టర్ పద్మజ సందర్శించి పరిశీలించారు. హనుమకొండలోని ఒక పరీక్ష కేంద్రంలో కాపీయింగ్ చేస్తూ ముగ్గురు విద్యార్థులు పట్టుబడగా సంబంధిత అధికారులు డీబార్ చేశారు. జూలై 6 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.


