మరిపెడ: భూపాలపల్లి డీటీఓ మద్దోజు వెంకన్న (45) మృతి తో మరిపెడ మున్నిపాలిటీలో విషాదఛాయలు అలుముకున్నాయి. డీటీఓ వెంకన్న సోమవారం భూపాలపల్లి ఆర్డీఓ కా ర్యాలయం ఎదుట వాహనాలు తనిఖీ చేస్తుండగా టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆయన స్వస్థలం మరిపెడలో స్థానికులు, బంధువులు కన్నీరుమున్నీయ్యారు. మరిపెడకు చెందిన మద్దోజు బ్రహ్మయ్య, ధనమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉమారాణి, రమ, కుమారుడు వెంకన్న సంతానం. బ్రహ్మయ్య మరిపెడలో ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా ఉద్యోగ విరమణ పొందాడు. కాగా, వెంకన్నకు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
విద్యాభ్యాసం..
డీటీఓ వెంకన్న మరిపెడ మండల కేంద్రంలోని సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలో 3 నుంచి 7వ తరగతి వరకు చదివారు. 7నుంచి 10 వరకు మరిపెడ జెడ్పీపీఎస్ఎస్లో, ఇంటర్, డిగ్రీ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో, బీటెక్ హైదరాబాద్లో చదివారు. అనంతరం విద్యుత్ శాఖలో పరీక్ష రాసి 2006–07 మధ్య భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏఈగా ఉద్యోగంలో చేరాడు. సుమారు ఐదు సంవత్సరాల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం గ్రూప్–1 పరీక్ష రాసి ఆర్టీఓగా అశ్వరావుపేటలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం జనగామ, జగిత్యాలలో ఆర్టీఓగా విధులు నిర్వహించి పదిహేను రోజుల క్రితమే డీటీఓగా భూపాలపల్లి జిల్లాకు ప్రమోషన్పై వచ్చారు.
వెంకన్న పార్థివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి
హన్మకొండ: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఆర్టీఓ వెంకన్న పార్థివదేహాన్ని హనుమకొండ అశోక కాలనీలోని నివాసానికి తీసుకొచ్చారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ గౌడ్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్.నాగరాజు, కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాం రెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చెక్పోస్టులు ఎత్తివేసిన తర్వాత నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారన్నారు. శవ రాజకీయాలు చేసేందుకు ఇది సందర్భం కాదన్నారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. అక్రమ రవాణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
వెంకన్న మృతి బాధాకరం..
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి బాధకరమని, క్రమశిక్షణ కలిగిన అధికారిని కోల్పోయామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ఎమ్మెల్యే గండ్ర.. వెంకన్న పార్థివ దేహానికి నివాళులర్పించి మాట్లాడారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి డీటీఓ మృతికి కారణమైన డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందేలా చూస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కన్నీరుమున్నీరైన గ్రామస్తులు, బంధువులు


