హన్మకొండ : రెండున్నర సంవత్సరాల కాలంలో అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నా, ఓటములు ఎదుర్కొన్నా పార్టీ వెంట నిలబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాల బాట పట్టించిన ప్రతీ ఒక్కరిని పేరుపేరునా గుర్తుంచుకుని, వారికి పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. సోమవారం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎస్ఆర్ఐ, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియాపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే ఏకై క లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఐదేళ్లు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం.. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షోభం.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం ఫరిడవిళ్తే, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షోభం నెలకొందని విమర్శించారు. 30 నెలల కాలంలో రాష్ట్రానికి చేసిన మంచి పని ఒక్కటి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధించే రేవంత్ రెడ్డి ముఠాను, అధికారులను అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టమని హెచ్చరించారు. కాంగ్రెస్ని నమ్మి ఓటేస్తే అన్ని వర్గాలను అడ్డగోలుగా మోసం చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏం లబ్ధి జరిగింది, ఎన్ని కొత్త పథకాలు వచ్చాయి, ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎరువుల కొరత, విత్తనాల కొరత, కరెంట్ కోతలు, కొత్తగా రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్రలు, రైతుబంధు ఎగవేత, రైతుబీమా రద్దు ఇలా దుర్మార్గంగా రైతులను ఏడిపిస్తున్న ముఖ్యమంత్రిని ఎంత తిట్టినా తక్కువేనన్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం చేస్తా.. ప్రతీ గింజ కొంటా అని చెప్పి ఇప్పుడు మళ్లీ నాలుక మడతేసి తాను చెప్పిన తీస్మార్ ఖాన్ డైలాగులు మర్చిపోయి రేవంత్ రెడ్డి బుడ్డర్ఖాన్ మాటలు మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు. నాడు రైతుబంధు మేమెందుకు ఎగగొడతాం.. దివానా గాల్లమా, మాకు జ్ఞానం లేదా? అని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే రైతుబంధుతో పాటు రైతన్నల ఎరువు, కరెంట్ అన్నింటిని ఎగగొట్టే కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై తిరగబడి కొట్లాడితేనే పరిస్థితులు మారుతాయన్నారు. ఇంకో ఏడాదిన్నర కష్టపడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముగింపు పలకొచ్చాన్నారు. ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదులో కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొనాలన్నారు. సభ్యత్వ నమోదు డిజిటల్ విధానంలో ప్రత్యేక యాప్ ద్వారా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాఽథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణా రెడ్డి, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, ఏనుగుల రాకేశ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదులో
కార్యకర్తలు క్రియాశీలంగా పాల్గొనాలి
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్


