మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఆదివారం నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరిగింది. సోషల్ వెల్ఫేర్ గురుకులంలో 353 మంది విద్యార్థులకు 307 మంది హాజరై.. 46 మంది గైర్హాజరయ్యారు. మోడల్ స్కూల్లో 144 మంది విద్యార్థులకు 123 మంది హాజరు కాగా, 21 మంది గైర్హాజరయ్యారు. బాలబాలికలను వేర్వేరుగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. ఇద్దరు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో వారు తిరిగి వెళ్లిపోయారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పరీక్ష ప్రశాంతంగా కొనసాగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ శబరీష్ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, తహసీల్దార్ రాజేశ్వరరావు, సీఐలు రఘుపతిరెడ్డి, అంజలి పాల్గొన్నారు.


