మరిపెడ రూరల్: నకిలీ విత్తనాలపై రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. విజయచంద్ర సూచించారు. మండలంలోని గుండెపూడి గ్రామానికి చెందిన కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నుంచి కేంద్ర ప్రభుత్వ నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలను సిండికేట్గా మారి రహస్య మార్గంలో దిగుమతి చేసుకుని తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో విక్రయిస్తున్నారు. దీనిపై ‘గుంటూరు టు గుండెపూడి’ అనే శీర్షికతో ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన జిల్లా వ్యవసాయ అధికారులు మరిపెడలోని సీతారామ, సూర్యతేజ ఏజెన్సీస్ విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించని డీలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. నకిలీ విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, అమాయక రైతులను మోసం చేసే వ్యక్తులు, నకిలీ విత్తనాలు విక్రయించే వారి వివరాలను వెంటనే సంబంధిత అధికారులకు తెలిపాలని కోరారు. బీటీ–3 పత్తి, నకిలీ విత్తనాలు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఏఓ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఏడీఏ శ్రీదేవి, ఏఓ బోడ వీరసింగ్ పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
విజయచంద్ర
మరిపెడలో విత్తన దుకాణాల్లో తనిఖీలు


