హన్మకొండ : విద్యుత్ భద్రతపై రాజీ లేదని, క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు శనివారం హనుమకొండలోని కార్పొరేట్ కార్యాలయం నుంచి 18 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ అనుమతి లేని వ్యక్తులకు ఎల్సీలు ఇవ్వడం తీవ్ర తప్పిదమని హెచ్చరించారు. ప్రతీ పనికి భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అనధికారంగా ఇతరులను విద్యుత్ స్తంభాలు ఎక్కించి పనులు చేయించడం నేరమన్నారు. ఆపరేషన్ సిబ్బంది హెడ్క్వార్టర్స్లో ఉంటూ పనులు చేపట్టాలని ఆదేశించారు. లైన్ క్లియరెన్స్లు తప్పనిసరిగా ఎల్సీ యాప్ ద్వారానే జరగాలని, లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాణం కంటే విలువైదని ఏది కాదని, విద్యుత్ పనులు చేపట్టే సమయంలో అన్ని భద్రతా పరికరాలు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు స్తంభాలు విరిగి, లైన్లకు నష్టం కలిగిన వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలన్నారు. డైరెక్టర్లు వి. మోహన్ రావు, సి.ప్రభాకర్, సి.ఈలు కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, అశోక్, మాధవ రావు, అన్నపూర్ణ, నాగ ప్రసాద్, సురేందర్, జీఎంలు నాగప్రసాద్, శ్రీనివాస్, ఈఈ (సివిల్) వెంకటేశ్వర్లు, డి.ఈలు అనిల్ కుమార్, భాస్కర్ పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి


